. 30 తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు..
విజయవాడ, ఫిబ్రవరి 28, (న్యూస్ పల్స్)
2025-26 ఆర్థిక సంవత్సరానిక గాను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో విద్యా, మున్సిపాల్టీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు ప్రకటించారు. ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందించడంతో స్థానిక సంస్థలకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుందని అన్నారు. కేంద్రీకృత బిల్లుల చెల్లింపుల విధానం నుంచి మున్సిపాల్టీలకు విముక్తి కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
2024 ఏప్రిల్ నెల నుంచి తమ బిల్లులను తామే చెల్లింపులు జరుపుకునేలా మున్సిపాల్టీలకు స్వేచ్ఛ నిస్తున్నట్లు తెలిపారు.క్యాపిటల్ ఎక్స్ పెడించర్ ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రత్యేక ప్రణాళికలు గురించి ప్రస్తావించారు. ప్రవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి నిర్ణయం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ప్రొత్సాహకంగా ప్రాజెక్టులో 20 శాతం మేర వయబులిటి గ్యాప్ ఫండింగ్ ఇచ్చేలా కూటమి ప్రభుత్వం స్కీం డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టుల గ్యాప్ ఫండింగ్ స్కీం కోసం రూ.2 వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తొలిసారిగా తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు బడ్జెట్లో కేటాయించారు.
తెలుగు భాషకు తామిచ్చే ప్రాధాన్యతను తెలియజేప్పేందుకే ఈ నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచారం కోసం బడ్జెట్టులో ప్రత్యేక కేటాయింపులు కూడా కేటాయించారు. నవోదయం 2.0 స్కీం కింద మద్యపాన, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం కోసం నిధుల కేటాయింపులు చేసినట్లు తెలిపారు. కాలుష్య రహిత ఆంధ్రగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేపడుతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల ప్రస్తావించారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. జీరో కాలుష్యం ఉండేలా ప్రణాళికలు రూపకల్పనపై బడ్జెట్టులో ప్రస్తావించారు.